Warangal Airport Permissions Granted వరంగల్లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన అనుమతులను మంజూరు 2024
తెలంగాణలో రెండో రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన అనుమతులను మంజూరు చేయడంతో పాటు తక్షణం పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు గారికి విజ్ఞప్తి చేశారు. ఆ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 253 ఎకరాల భూ సేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.205 కోట్లను భారత విమానయాన సంస్థ (AAI)కి అందజేసినట్టు తెలిపారు.
![Warangal Airport Permissions Granted వరంగల్లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన అనుమతులను మంజూరు 2024 1 Ramohan Nayudu](https://rythuprasthanam.com/wp-content/uploads/2024/11/rn-2-300x200.webp)
తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్రానికి చెందిన అందుబాటులో ఉన్న ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని కలిసి చర్చించారు.తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని ముఖ్యమంత్రి గారు వివరిస్తూ, వరంగల్తో పాటు పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్లలో ప్రతిపాదిత విమానాశ్రయాల గురించి కేంద్ర మంత్రికి నివేదించారు.
![Warangal Airport Permissions Granted వరంగల్లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన అనుమతులను మంజూరు 2024 2 Ramohan Nayudu vs Cm Revanth Reddy](https://rythuprasthanam.com/wp-content/uploads/2024/11/rn-3-300x200.webp)
వరంగల్ తో పాటు మిగతా ప్రాంతాల్లో విమానాశ్రయాల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై వారితో చర్చించారు. ఒక విమానాశ్రయం నుంచి మరో విమానాశ్రయానికి 150 కి.మీ దూరం ఉండాలన్న నిబంధన అడ్డురాదని, ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ సంస్థ నుంచి నిరభ్యంతర పత్రం (NOC) పొందిన అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిపాదిత విమానాశ్రయ ఏర్పాటుకు గతంలో గుర్తించిన స్థలం అనువుగా లేనందున ప్రత్యామ్నాయంగా పాల్వంచలో 950 ఎకరాలు గుర్తించినట్టు సీఎం గారు వివరించారు. ఆ భూమి వివరాలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అందజేశామని, వెంటనే విమానాశ్రయ ఏర్పాటుకు తదుపరి చర్యలు తీసుకోవాలని కోరారు.
పెద్దపల్లి జిల్లాలో గతంలో గుర్తించిన భూమి విమానాశ్రయ నిర్మాణానికి అనువుగా లేదని ఏఏఐ ప్రీ-ఫీజుబిలిటీ సర్వేలో తేలిన విషయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రస్తావిస్తూ, అందుకు ప్రత్యామ్నాయంగా అంతర్గాంలో 591.24 ఎకరాలు గుర్తించామని, దానిపై తదుపరి చర్యలు చేపట్టాలని కోరారు.ఆదిలాబాద్లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో ఇప్పటికే 369.50 ఎకరాల భూమి ఉందని, పూర్తి స్థాయి కార్యకలాపాల విస్తరణకు అదనంగా 249.82 ఎకరాలు అవసరమని, అదనంగా అవసరమైన భూమిని సేకరించి అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పారు.
ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రిని కలిసిన సందర్భంగా పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, రామసహాయం రఘురాం రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, కడియం కావ్య గారు, కుందూరు రఘువీర్ గారు ఉన్నారు.
Please central government imidatly warangal Airport✈️ founds