Telangana government announced go shalaa 2025
రాష్ట్రంలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలను ఏర్పాటు చేయడానికి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. గోశాలల ఏర్పాటుకు సంబంధించి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా, నిర్ణీత గడువులోగా నివేదిక రూపొందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
రాష్ట్రంలో గోశాలల ఏర్పాటు, నిర్వహణ, సంరక్షణ, అభివృద్ధి వంటి అంశాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. గోశాలల నిర్మాణం, నిర్వహణ, సంరక్షణ కోసం పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలు రూపొందించాలని చెప్పారు.గోసంరక్షణ, వాటి నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాలల ఏర్పాటు జరగాలని, మొదటి దశలో రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీ, కళాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, కళాశాలలు, దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
గోశాలల ఏర్పాటు కోసం అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని, కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బంధించినట్టుగా ఇరుకు స్థలాల్లో కాకుండా మేతకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ఉండాలన్నారు. గోశాలల నిర్వహణ, సంరక్షణ విషయంలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించి పలు మార్పులను సూచించారు. మరో నాలుగైదు రోజుల్లోగా తుది మోడల్ను ఖరారు చేయాలని చెప్పారు.