Cm Revanth Reddy Davos trip starting date: ఫ్యూచర్ సిటీగా హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేశారు. తొలి ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివద్ది పనులన్నీ తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయని అన్నారు. ఫ్యూచర్ సిటీగా వెలుగొందుతున్న హైదరాబాద్ సిటీలో ఉన్న సానుకూలతలను ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.

పెట్టుబడులకు గమ్య స్థానంగా ఇప్పటికే తెలంగాణ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని ముఖ్యమంత్రి గారు అన్నారు. దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణముందని అభిప్రాయపడ్డారు.గత ఏడాది ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఏయే కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించాయి.. అవి ఏయే దశలో ఉన్నాయని ముఖ్యమంత్రి గారు అధికారులను అడిగి తెలుసుకున్నారు.గత ఏడాది దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో చేసుకున్న ఒప్పందాలతో రాష్ట్రానికి రూ.40232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 14 ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడుల కు ముందుకు రాగా, దాదాపు 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయి. వీటిలో దాదాపు 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎం గారికి వివరించారు. పది ప్రాజెక్టులు వివిధ దశల్లో వేగం పుంజుకున్నాయని, ఏడు ప్రాజెక్టుల అమలు ప్రారంభ దశలో ఉందని తెలిపారు.
కంపెనీల వారీగా పురోగతిని మంత్రి శ్రీధర్ బాబు గారితో చర్చించిన ముఖ్యమంత్రి గారు ప్రజా పాలన తొలి ఏడాదిలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని సంతృప్తి వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి 16 నుంచి 19 వరకు సింగపూర్, 20 నుంచి 22 వరకు దావోస్ లో పర్యటించనున్నారు. సీఎం గారితో పాటు మంత్రి శ్రీధర్ బాబు గారు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటనలో ఉంటారు. సింగపూర్ లో స్కిల్ యూనివర్సిటీతో ఒప్పందాలతో పాటు ఇతర పెట్టుబడులకు సంబంధించి సంప్రదింపులు జరుపుతారు. దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు.
ఈ ఆరు రోజుల పర్యటనకు సంబంధించిన షెడ్యూలుతో పాటు, అక్కడ జరిగే సదస్సులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశాల ప్రణాళికను అధికారులు ముఖ్యమంత్రి గారికి వివరించారు.జనవరి 20 నుంచి ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక దావోస్ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడుల సమీకరణ, వాటి పురోగతి తదితర అంశాలపై పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఉన్నతాధికారులతో సమావేశంలో ముఖ్యమంత్రి గారు సమీక్షించారు.