CM Revanth Reddy Meet With CEO Sathya Nadendla: ప్రపంచ టెక్ దిగ్గజ మైక్రోసాఫ్ట్ సంస్థ చైర్మన్ & సీఈవో సత్య నాదెళ్ల
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రపంచ టెక్ దిగ్గజ మైక్రోసాఫ్ట్ సంస్థ చైర్మన్ & సీఈవో సత్య నాదెళ్ల గారితో భేటీ అయ్యారు. మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి సీఎం గారు హైదరాబాద్లోని సత్య నాదెళ్ల గారి నివాసంలో సమావేశమయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలనే తమ నిబద్ధతను కొనసాగిస్తామని సత్య నాదెళ్ల గారు తెలిపారు. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విషయంలో ముఖ్యమంత్రి గారి దార్శనికతను సత్య నాదెళ్ల గారు ప్రశంసించారు.ప్రజా ప్రభుత్వం తలపెట్టిన నైపుణాభివృద్ది, మెరుగైన మౌలిక వసతల కల్పన వంటి అంశాలు ఆర్థికాభివృద్ధికి దోహదపడటంతో పాటు హైదరాబాద్ను ప్రపంచంలోని టాప్ నగరాల్లో ఉంచగలవని సత్య నాదెళ్ల గారు అభిప్రాయపడ్డారు.టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ను ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం ఏఐ, Gen AI, క్లౌడ్ ఆధారిత వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి సారించిందని, ఈ ప్రయత్నాలకు మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా మద్దతుగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు గారు సత్య నాదెళ్ల గారికి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్లోని తొలి సాంకేతిక సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఒకటని, ప్రస్తుతం 10,000 మందికి ఉపాధి కల్పిస్తోన్న విషయాన్ని గుర్తుచేసిన ముఖ్యమంత్రి గారు.. రాష్ట్రంలోని 600 మెగావాట్ల (MW) సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ లోనూ మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టిన అంశాన్ని ప్రస్తావిస్తూ హైదరాబాద్తో పాటు తెలంగాణవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులను విస్తరిస్తున్నందుకు సత్య నాదెళ్ల గారికి కృతజ్ఞతలు తెలిపారు.రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధి, రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పనకు అమలు చేస్తున్న ప్రణాళికలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వంటి సంస్థల ద్వారా పరిశ్రమలకు అవసరమైన ప్రతిభావంతులను అందుబాటులో ఉంచేందుకు ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు సత్య నాదెళ్ల గారికి వివరించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ గారు, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి గారు పాల్గొన్నారు.