వ్యవసాయానికి ఏటా 17 వేల కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్ కోసం ఖర్చు చేస్తున్నాం | Telangana Announced Free Current From Solar 2025

Telangana Announced Free Current From Solar

రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని విశ్వసించి గడిచిన 18 నెలల కాలంలో వ్యవసాయ రంగంపై 1 లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. గడిచిన పదేళ్లలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నమైన పరిస్థితుల నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ రైతులకు వ్యవసాయం దండగ కాదు.. పండుగ చేయాలన్న సంకల్పంతో పని చేస్తున్నామని చెప్పారు.

ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన #RythuNestham కార్యక్రమంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారితో పాటు రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల ద్వారా లక్షల మంది రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతు భరోసా నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి గారు.. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, కనీస మద్దతు ధర, బోనస్ చెల్లింపు, రైతు బీమా వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలపై గడిచిన 18 నెలల కాలంలో 1 లక్ష కోట్ల రూపాయలు వ్యవసాయం రంగంపై ఖర్చు పెట్టామన్నారు. ఈ విషయంలో పైసా పైసా లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.

“అధికారం చేపట్టే నాటికి లక్షల కోట్ల అప్పులు, ఎన్నో చిక్కుముళ్లు, ఎన్నెన్నో సమస్యలు. అడుగు వేయాలంటే చీకటి పరిస్థితి. అక్కడి నుంచి వెలుగు వైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రైతాంగాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో రైతులను చైతన్య పరిచి వాణిజ్య పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంలో అవసరమైన పనిముట్లను అందించి రైతులను ప్రోత్సహించాలి. రైతుల పెట్టుబడికి రెండింతలు లాభం వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది. పరిశ్రమలు పెట్టే వారికి సబ్సిడీలు, భూములు ఇచ్చినట్టే వ్యవసాయం చేసుకుంటున్న పేద రైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలతో పాటు వారికి టెక్నాలజీ బదిలీ చేయాల్సిన అవసరం ఉంది.

వ్యవసాయానికి ఏటా 17 వేల కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్ కోసం ఖర్చు చేస్తున్నాం. సోలార్ విద్యుత్ కు మారితే వ్యవసాయం ఉచితమే కాదు.. సోలార్ విద్యుత్ ద్వారా నెలకు రెండుమూడు వేల ఆదాయం ఆడబిడ్డలకు వచ్చే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. సోలార్ పంపు సెట్ల వల్ల ప్రయోజనాలను రైతులకు వివరించాల్సిన అవసరం ఉంది.ధరణిని అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వం రైతులను ముప్పుతిప్పలు పెడితే, ప్రజా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెచ్చి అండగా నిలబడ్డాం. గ్రామ సభలు పెట్టి రైతుల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం.

దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా తొలి ఏడాదిలో 60 వేల ఉద్యోగ నియామకాలు, మహిళల సాధికారత, ఎస్సీ వర్గీకరణ, సామాజిక న్యాయం వంటి ఎన్నో అంశాల్లో ముందుకు వెళ్లాం. ప్రతి శాఖను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. చిన్న చిన్న తప్పులు ఎక్కడైనా దొర్లినా సరిదిద్దుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం.ఈరోజు తెలంగాణ ప్రజలకు శుభదినం. వచ్చే 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో పడుతాయి..” అని ముఖ్యమంత్రి గారు రైతుల హర్షధ్వానాల మధ్య అనేక అంశాలను వివరించారు.

Leave a Comment