Metro Rail Phase II is Strated In Telangana
హైదరాబాద్ మెట్రో ఫేజ్-II కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారికి విజ్ఞప్తి చేశారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్-II అవసరం ఎంతో ఉందని వివరంగా తెలియజేశారు.
ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్ గారితో వారి నివాసంలో సమావేశమయ్యారు. రూ. 24,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మెట్రో ఫేజ్-II సాకారమైతే నగరంలో రాకపోకలు వేగంగా సాగడంతో పాటు రహదారులపై రద్దీ తగ్గుతుందని.. సుస్థిరాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు.
పట్టణ వ్యవహారాల శాఖ సూచన మేరకు అవసరమైన సవరణలు చేసి ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-II ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎంపీలు డాక్టర్ మల్లు రవి గారు, రఘువీర్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి గారు, హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గారు, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ గారు పాల్గొన్నారు.