భూమిలేని ప్రతి ఒక్కరికి నెలకు 5000 పెన్షన్ ఇవ్వనున్న ప్రభుత్వం | CRDA decided to restore 5000 pension

CRDA decided to restore 5000 pension

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ఉన్న భూమి లేని పేదలకు పింఛన్లు ఇచ్చే చర్యలు చేపట్టింది. ఈ మేరకు సీఆర్డీఏ కసరత్తు జరుపుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశంలో అమరావతిలో ఉన్న భూమి లేని పేదలకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు. 4,929 మందికి పింఛన్ల పునరుద్ధరణపై త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నెలకు 5 వేల రూపాయలు చొప్పున వీరికి పింఛన్ ఇచ్చేందుకు సీఆర్డీఏ చర్యలు ప్రారంభించింది.

అమరావతి రాజధానికి భూసమీకరణ చేసిన సమయంలోనే భూమి లేని పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదని వారికి పింఛన్ అందించాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. భూమి లేని 4,929 మంది పేదలకు పింఛన్లు అందించేవారు. ఆ తర్వాతి కాలంలో క్రమంగా రాజధాని పనులు నిలిచిపోయాయి.దీంతో కొంతమంది పేదలకు పింఛన్లు కూడా రద్దయ్యాయి.మల్లి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీరికి పింఛన్లు పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఇందుకోసం సీఆర్డీఏ దరఖాస్తులు స్వీకరించనుంది. అర్హులైన వారు గ్రామాల్లోని సీఆర్‌డీఏ కార్యాలయాల్లో పింఛన్ల కోసం దరఖాస్తులు ఇవ్వాలని సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు వెల్లడించారు. గ్రామసభల సమయంలోనూ పింఛన్ల కోసం అర్జీలు సమర్పించవచ్చని సూచించారు.

అమరావతి పరిధిలోని భూమి లేని పేదలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఇంకోవైపు అమరావతి రాజధాని కోసం గత టీడీపీ ప్రభుత్వం 33 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించిన సంగతి తెలిసిందే. వారికి రిటర్నబుల్ ప్లాట్లతో పాటుగాకౌలు చెల్లింపులు చేస్తోంది. భూమి లేని పేదలకు పింఛన్లు అందించాలనే ఉద్దేశంతో 2015-16 మధ్యకాలంలో అప్పటి ప్రభుత్వం 29 గ్రామాల్లో 21,374 భూమి లేని కుటుంబాలను గుర్తించింది.నెలకు రూ. 2,500 చొప్పున వారికి పింఛన్లు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024 ఫిబ్రవరిలో ఈ పింఛన్ మొత్తాన్ని పెంచారు. 2500 రూపాయల నుంచి 5 వేల రూపాయలకు పెంచారు.

అందులో కరెంట్ బిల్లు సహా వివిధ సాంకేతిక కారణాలతో లబ్ధిదారుల సంఖ్యను కుదించారనే విమర్శలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో గెలిచి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి లేని పేదలకు ఇచ్చే పింఛన్ల కాలపరిమితిని మరో ఐదేళ్లు పెంచారు. రాజధాని గ్రామాల్లో అర్హులైన వారికి పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు చర్యలు చేపట్టారు.

Leave a Comment