Cm Revanth Reddy Given To Appointment Latters
తెలంగాణలో తరతరాలుగా వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న చిత్తశుద్ధితో పని చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నీటి పారుదల శాఖలో కొత్తగా నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులను ఉద్దేశించి చెప్పారు. తెలంగాణ రైతులు ఆత్మగౌరవంతో బతకడానికి అవసరమైన నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వాములై ప్రజల భావోద్వేగానికి ప్రతీకలుగా నిలబడాలని సూచించారు.
కొలువుల పండుగలో భాగంగా నీటి పారుదల శాఖలో కొత్తగా ఎంపికైన 244 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, (AEE), 199 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్ (JTO) లకు జలసౌధ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తూ, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవుతున్న ఉద్యోగులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.“గత నలభై యాభై ఏళ్లుగా రావలసిన నీళ్లు రాకపోగా, పూర్తి కావలసిన ప్రాజెక్టులు పూర్తి కాని కారణంగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, వాయిదా పడుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. నీళ్లు ఎంత అవసరమో అందుకు ఎంతగా పరితపించామో, ఏ నీటి కోసమైతే పోరాటం మొదలైంతో ఆ నీళ్లే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టాయి. అందుకే నీటి పారుదల శాఖకు ప్రభుత్వం అంత ప్రాధాన్యత ఇస్తోంది.ఉమ్మడి రాష్ట్రంలో నాలుగైదు దశాబ్దాలు వాయిదా పడిన ప్రాజెక్టులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లలో కూడా పూర్తి కాలేదు. జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమైన ప్రాజెక్టులు తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో ఏదీ పూర్తి కాలేదు. ఈనాటికీ వాయిదాలు పడుతూనే ఉన్నాయి.
తెలంగాణ ప్రజలకు అతిపెద్ద సెంటిమెంట్ నీళ్లు. ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత కింద పూర్తి చేస్తాం. ఇంజనీర్లుగా మీరు చేపట్టే ప్రాజెక్టులు భవిష్యత్తు తరాలకు అందించాల్సిన భాధ్యత ఉంది. ఇది నెలనెలా జీతం తీసుకునే ఉద్యోగంగా కాకుండా ఒక బాధ్యతగా, ప్రజల భావోద్వేగంగా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములై రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి.పదేళ్లుగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. ‘
గత సెప్టెంబర్ లో ఇదే వేదిక నుంచి 738 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను, జూనియర్ అసిస్టెంట్లకు నియామాక పత్రాలు అందించి భుజం తట్టాం. మళ్లీ ఈరోజు 443 ఉద్యోగాలను నియమించాం. 14 నెలల కాలంలో ఈ ఒక్క శాఖలోనే 1121 మందిని నియమించామంటే ఈ శాఖకు ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలి.ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు, ప్రత్యేక తెలంగాణలో పదేళ్లు నోటిఫికేషన్ల కోసం కొట్లాడాం. ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యత ఉద్యోగ నియామకాలు. 14 నెలల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించాం. 3 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులను తీసుకొచ్చాం. యువతకు విద్య, ఉద్యోగాల కల్పన ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. అడ్డంకులను అధిగమించి తొందరలోనే గ్రూప్ I, II, III, IV నియామకాలు పూర్తి చేస్తాం…” అని ముఖ్యమంత్రి గారు ఉద్యోగులను ఉద్దేశించి వివరించారు.